బారిష్టర్ పార్వతీశం

by K.S.M.Phanindra

“బారిష్టర్ పార్వతీశం” అంటే ఒక హాస్య పాత్రనీ, అతను అమాయకుడు, వెర్రివాడూ అనీ ఇప్పటి వరకూ నా భావన. మరి స్కూల్లో చదువుకున్న తెలుగు non-detailed పుస్తకంలో ఇలాగే ఉంది. అయితే నా భావన తప్పని ఈ మధ్యే చదివిన detailed నవల చెప్పింది. 550 పేజీల ఈ పుస్తకంలో నేను ఎరిగిన పార్వతీశం కన్నా విభిన్నమైన ఒక సంపూర్ణ వ్యక్తిత్వం దర్శనమిస్తుంది.

“బారిష్టర్ పార్వతీశం” మూడు భాగాల నవల. మొక్కపాటి నరసింహశాస్త్రి గారికి కీర్తి ప్రతిష్టలు కట్టబెట్టిన ఈ రచన మొదటి భాగం అత్యంత జనాదరణ పొందింది. ఈ భాగంలో పార్వతీశం పుట్టుపూర్వోత్తరాలూ, అతని అటకెక్కిన చదువూ, రాజకీయ భావాలూ, ఇంగ్లాండు వెళ్ళాలన్న నిర్ణయం, ఇంట్లో చెప్పాపెట్టకుండా ప్రయాణం కట్టడం, దారీ పొడుగునా అజ్ఞానం వల్ల నవ్వులపాలు కావడం, ఎలాగో చెన్నై చేరి అక్కడి నుండి కొలొంబో చేరి చివరికి నౌక ద్వారా ఇంగ్లాండులో కాలుమోపడం కనిపిస్తాయ్. ఈ భాగం లో హాస్యం పాలు ఎక్కువ ఉండడం వల్ల జనాలకి బాగ గుర్తుండిపోయింది. అలాగే ఈ భాగంలో విషయం వల్ల పార్వతీశం ఒక విదూషకుడిలా చాలా మందికి గుర్తుండిపోయాడు.

 అయితే నిజానికి పార్వతీశం అమాయకుడు కాడనీ, తెలియనితనం వల్ల నవ్వులపాలు అయ్యాడు కానీ తెలివైన వాడు అనీ మనకి రెండో భాగంలో తెలుస్తుంది. రెండో భాగంలో ఆనాటి ఇంగ్లాండు జీవనం, పార్వతీశం అక్కడ మొదటి రోజుల్లో పడిన అవస్థలూ, బారిస్టర్ కోర్సుకి కట్టడం, ఇంగ్లాండు తెలుగు సమాఖ్య మిత్రులతో చేసిన అల్లల్రులు, paying guest గా ఉంటున్న ఇంటి యజమానురాలి కూతుర్లతో ఆడిన సరసాలూ, ఇంకా గోల్ఫ్ ఆటలో అత్యంత ప్రావీణ్యం సంపాదించి ఎన్నో బహుమతులు పొందడం, ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులూ, ఒక దొరసానితో సఖ్యతా, అనుబంధం, దాదాపు ప్రేమించడం, బారిష్టర్ పరీక్ష ప్రథమ శ్రేణిలో జయప్రదంగా ఉత్తిర్ణుడయ్యి తన ప్రియురాలికి కన్నీటితో వీడ్కోలు పలికి తిరిగి భారతదేశం చేరడం కనిపిస్తాయ్. నిజానికి ఈ నవల రచయిత స్వానుభవం నుండీ వచ్చినది – ఆయనా బారిస్టర్ చదువుకై ఇంగ్లాండ్ వెళ్ళారు. కాబట్టి ఇంగ్లాండ్ వర్ణన సహజంగా, ఎన్నో చమత్కార సంఘటనలతో కూడి రసవత్తరంగా సాగుతుంది. ఆనాటి సాంఘిక పరిస్థితులని మనకి చూపెడుతుంది. ఈ భాగంలో కొంత ప్రణయాలూ, పడుచు అల్లరులూ ఎక్కువ కనిపించి రసస్ఫూర్తికి ఇతోధికంగా దోహదం చేస్తాయ్!

ఇక ఆఖరిదైన మూడవ భాగంలో ఇంటికి చేరడం, తన ఊరి వారికి ఇంగ్లాండ్ విశేషాలు చెప్పడం, ఒక చక్కని చుక్కని చూసి మనసు పారేసుకుని పెళ్ళి చేసేసుకోవడం, లాయరుగా ప్రాక్టీసు పెట్టడం, చక్కని పేరు సంపాయించడం, ఇంతలోనే భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆకర్షించబడడం, పాల్గొనడం, స్వాతంత్రం వచ్చాక తిరిగి కొంత కాలం లాయరు వృత్తిలో ఉండి, ఆ వృత్తిలో ఉండే అన్యాయాలూ, మనస్తత్త్వాలూ పడక హాయిగా సొంత ఊరుకి చేరుకుని వ్యవసాయం చేసుకోడం కనిపిస్తాయ్. ఈ భాగంలో ముఖ్యంగా ఐదు రోజుల పెళ్ళి వర్ణన, భారత స్వాతంత్ర ఉద్యమ పరిస్థితులూ ఆసక్తి కలిగిస్తాయ్. ఐతే కథ చివరలో కొంత abrupt గా ముగించినట్టు అనిపిస్తుంది.

ఈ పుస్తకంలో కథతో పాటూ రచయిత ప్రతి భాగానికి రాసిన “తుది పలుకులు” ఎంతో ఆసక్తి కలిగించేలా ఉన్నాయ్. ఈ నవలకి ఆ రోజుల్లో వచ్చిన విమర్శలని కొంత ప్రస్తావించారు రచయిత. నవ్వు మనలో “అహంకార భావం” (ego) వల్ల వస్తుంది వంటి philosophical విషయాల గురించి చర్చ కూడా చదవొచ్చు. అలాగే పార్వతీశానికీ, గురజాడ గారి గిరీశానికీ, పానుగంటి వారి గణపతికీ మధ్య పోలికలూ, తేడాల గురించీ రచయిత వివరిస్తారు. తిట్ట్లు హాస్యం అనిపించుకోవని వీరేశలింగం గారినీ, పానుగంటి వారినీ సున్నితంగా రచయిత విమర్శిస్తారు. అలాగే అల్ప విషయాల నుండీ హాస్యం పుట్టించిన ఘనత చింతా దీక్షితుల వారిది మాత్రమే అని పేర్కొంటారు.

 మొత్తానికి చాలా కాలం తర్వాత ఒక చక్కని తెలుగు నవల చదవడం సంతృప్తి కలిగించింది. english నవలల్లో ఉండే అందాలూ విషయాలూ ఒకటైతే మనదైన నవలల్లో మనదైన అందం, విజ్ఞానం, సాహిత్యం కనిపించి మురిపింపజేస్తాయ్. ఈ విషయం గ్రహించక మన తెలుగు నవలల్లో పెద్ద విషయం ఏమీ ఉండదు, ఆ ఇంగ్లీష్ వాళ్ళ creativity చూడండి, మనవన్నీ కాపీ మాత్రమే అనే వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది. పార్వతీశం అమాయకుడూ, వెర్రివాడూ అనుకోవడం ఎంత తప్పో ఇదీ అంతే తప్పు!